జెండా ఉండాల్సిందే, జనం నమ్మరు, నాగం, మోత్కుపల్లి, ఎర్రబెల్లి మధ్య వివాదం-Eenadu.us
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతల సమావేశంలో ఆ పార్టీ శాసనసభ్యులు నాగం జనార్ధన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నరసింహులు మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ టిడిపి నేతల విస్తృతస్థాయి సమావేశాన్ని సోమవారం టిడిఎల్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అసంతృప్త ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ జెండా లేకుండా నాగం సభలు నిర్వహించడం, పార్టీని, అధినేతను ధిక్కరించడంపై ఎర్రబెల్లి, మోత్కుపల్లి నాగంను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మనసులో దురుద్దేశ్యాలు పెట్టుకొని నాగం జనార్దన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.
పార్టీ అధినేతను ఇబ్బందులకు గురి చేసే విధంగా నాగం జనార్ధన్ రెడ్డి తీరు ఉందని మోత్కుపల్లి అన్నట్లుగా తెలుస్తోంది. నాగం సొంత ప్రయోజనం కోసం పని చేస్తున్నారని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. అయితే మోత్కుపల్లి, ఎర్రబెల్లి ప్రశ్నలకు నాగం కూడా ఘాటుగానే స్పందించినట్లుగా తెలుస్తోంది. పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదని, దాంతో పార్టీ జెండాలతో సమావేశం ఏర్పాటు చేస్తే ప్రజలు నమ్మె పరిస్థితి లేదని నాగం చెప్పినట్లుగా సమాచారం. ప్రజాభిప్రాయం మేరకే అందరూ నడుచుకోవాలని నాగం సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే నాగం వ్యాఖ్యలను మరికొందరు సమర్థించినట్లుగా తెలుస్తోంది. దీంతో సమన్వయ కమిటీలో రెండు వర్గాలు ఎర్పడినట్లుగా సమాచారం.
కాగా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యమం ఎలా నిర్వహించాలిఅనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ నెల 21న తెలంగాణ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తెలంగాణ టిడిపి నిర్ణయించుకుంది. కాగా అదేరోజు పరిగిలో హరీశ్వర్ రెడ్డి నిర్వహించనున్న సభను టిడిపి జెండాతో నిర్వహించాలని పలువురు కోరారు. అలాగే 23 నుండి 26 వరకు గన్ పార్కు నుండి యాదగిరి గుట్ట వద్దకు పాదయాత్ర నిర్వహించాలని కూడా నిర్ణయించారు. పాదయాత్రను పార్టీ జెండాలతో నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణపై చిదంబరానికి లేఖ రాయాలనే ప్రధాన అంశంపై వారు భేటీ అయ్యారు. కాగా అంతకుముందు విలేకరులతో మాట్లాడిన నాగం జనార్దన్ రెడ్డి సమావేశం అనంతరం ఎజెండా చూసి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు.
Short URL: http://www.eenadu.us/?p=1146








